న్యూఢిల్లీ: కొత్త విద్యుత్తు కనెక్షన్లు పొందడాన్ని సులభతరం చేస్తూ కేంద్రం నిబంధనలు సవరించింది. గ్రామాల్లో 15 రోజుల్లోగా కొత్త కనెక్షన్ ఇవ్వనున్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో మూడు రోజుల్లోగా, పురపాలికల్లో వారంలోగా వాటిని పొందవచ్చు. ఈ మేరకు విద్యుత్తు(వినియోగదారుల హక్కులు) నిబంధనలు-2020కి సవరణలు చేసినట్టు కేంద్ర విద్యుత్తు శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్లను కూడా సులభతరం చేయనున్నట్టు కేంద్రం చెప్పింది.
దీనికి సంబంధించిన బిల్లింగ్ విధానాన్ని కూడా కామన్ ఏరియా లేదా వ్యక్తిగత క్యాటగిరీ కింద ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ కస్టమర్కు ఉంటుందని తెలిపింది. కస్టమర్లు విద్యుత్తు వాహనాల చార్జింగ్ కోసం ప్రత్యేక కరెంట్ కనెక్షన్ పొందవచ్చు. సహకార గృహ సంఘాలు కరెంటు కనెక్షన్ల పంపిణీ లైసెన్సులను ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా పొందవచ్చు లేదా మొత్తం గృహాల సముదాయానికి సింగిల్ పాయింట్ కనెక్షన్ పొందవచ్చు. మీటర్ రీడింగ్పై కస్టమర్లు ఫిర్యాదు చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సుదారుడు ఐదు రోజుల్లోపు అదనపు మీటర్ను బిగించాలి.