పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ పాట్నా వైద్య కాలేజీ ఆసుపత్రిని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి తేజస్వి యాదవ్ మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ నిద్ర పోయేందుకు సిద్ధమవుతూ ఆయన కంటపడ్డారు. అలాగే రాత్రి వేళ సీనియర్ వైద్యులు విధుల్లో లేరు. హెల్త్ మేనేజర్ విధులు నర్సులు నిర్వహిస్తున్నారు. ఒక రోగి మృతదేహాన్ని నిర్లక్ష్యంగా ఆసుపత్రి కారిడార్లో వదిలేశారు. వీధి కుక్కలు ఆసుపత్రిలో తిరుగుతున్నాయి.
మరోవైపు పాట్నా వైద్య కాలేజీ ఆసుపత్రిలో సౌకర్యాల లేమి, మందుల కొరతపై రోగులు, వారి బంధువులు మంత్రి తేజస్వికి మొరపెట్టుకున్నారు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, దీంతో మహిళలు కూడా బయటకు వెళ్లి డబ్బులు చెల్లించి పే టాయిలెట్లను వినియోగించుకోవాల్సి వస్తున్నదని ఫిర్యాదు చేశారు.
అనంతరం మంత్రి తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. పాట్నా వైద్య కాలేజీ ఆసుపత్రి (పీఎంసీహెచ్)తో పాటు మరో రెండు హాస్పిటల్స్ను రాత్రి వేళ తనిఖీ చేసినట్లు చెప్పారు. పీఎంసీహెచ్లోని టాటా వార్డు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. ఫార్మసీలో మందుల కొరత, సీనియర్ వైద్యులు రాత్రి వేళ అందుబాటులో లేకపోవడం, అపరిశుభ్రత, రోగులకు సౌకర్యాల లేమి వంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. వీటి బాధ్యత అంతా సూపరింటెండెంట్దే అని అన్నారు. హాస్పిటల్లోని లోపాలను తమ ప్రభుత్వం సరిచేస్తుందని వెల్లడించారు.