న్యూఢిల్లీ, అక్టోబర్ 4: మరోసారి రహస్య పత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదార్ల గట్టురట్టయ్యింది. పన్నుల్లేని లేదా తక్కువ పన్నులున్న దేశాల్లోకి సంపదను మళ్లించిన దేశాధినేతలు, వాణిజ్య వేత్తలు, వివిధ రంగాల సెలబ్రిటీలు, డ్రగ్ డీలర్ల పేర్లు ‘పండోరా పేపర్స్’లో బహిర్గతమయ్యాయి. ఇందులో వందల సంఖ్యలో భారత కుబేరులు కూడా ఉన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ తరహాలోనే పరిశోధనాత్మక జర్నలిస్టులతో కూడిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఈ పండోరా పేపర్స్ను విడుదల చేసింది. 117 దేశాల్లోని 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది జర్నలిస్టులు లక్షలాది పత్రాల్ని పరిశోధించి, విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించారు. పనామా పేపర్స్కంటే పెద్దదైన ఈ రహస్య ఆర్థిక లావాదేవీల వ్యవహారం పలు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమస్ ఐలండ్స్ వంటి దేశాల్లో నల్లధనాన్ని దాచుకునేందుకు కుబేరులు సూట్కేస్ కంపెనీల్ని, ట్రస్టుల్ని సృష్టించారు. వాటి ద్వారా స్వదేశాల నుంచి సంపదను మళ్లించారు.
జాబితాలో ఏడుగురు రాజకీయ వేత్తలు
పండోరా పేపర్స్ జాబితాలో 380 మందికి పైగా భారతీయుల పేర్లు ఉన్నాయి. ఇందులో అనిల్ అంబానీ, వినోద్ అదానీ, కిరణ్ మజుందార్ షా, నీరా రాడియా, సచిన్ టెండూల్కర్, సతీష్ శర్మ, నటుడు జాకీష్రాఫ్, వ్యాపారవేత్త నీరవ్ మోదీ తదితరులున్నారు. భారత్కు చెందిన ఏడుగురు రాజకీయ వేత్తల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. బ్రిటన్ కోర్టులో ఇటీవల దివాలాను ప్రకటించిన అనిల్ అంబానీకి 18 అసెట్ హోల్డింగ్ ఆఫ్షోర్ కంపెనీలున్నాయి. వీటి ద్వారా 1300 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, నగల వ్యాపారి నీరవ్ మోది భారత్ వీడటానికి ముందు, ఆయన సోదరి విదేశాల్లో ఒక ట్రస్ట్ను ఏర్పాటుచేసి, నిధుల్ని దానికి బదిలీ చేశారు. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా భర్త.. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ అభియోగాల్ని ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి విదేశాల్లో డీన్స్టోన్ పేరుతో ట్రస్ట్ను ఏర్పాటుచేసి, ఆర్థిక లావాదేవీలు నడిపారు. పనామా పత్రాలు వెల్లడైన తర్వాత కొంతమంది జాగ్రత్త పడినట్లు తాజాగా పండోరా పేపర్స్లో వెల్లడయ్యింది. ఈ తరహాలో సచిన్ టెండూల్కర్.. పనామా పత్రాల వెల్లడైన మూడు నెలల్లో బ్రిటన్ వర్జిన్ ఐలాండ్స్లో తన సంస్థ సాస్ ఇంటర్నేషనల్ను రద్దుచేసుకున్నారు. కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు 12 సూట్కేస్ కంపెనీలున్నట్లు పండోరా పేపర్స్లో వెల్లడయ్యింది. రాడియా పేరు పనామా పత్రాల్లో కూడా ఉన్నది.
విదేశీ ప్రముఖులు..
జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రేజ్ బాబిస్, కెన్యా అధ్యక్షుడు యుహురు కెన్యాట్టా, ఈక్విడార్ అధ్యక్షుడు లాసోలు పన్ను రహిత దేశాల్లో జరిపిన లావాదేవీలు వెల్లడయ్యాయి. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సన్నిహితుల పేర్లు కూడా పండోరా పేపర్స్లో ఉన్నాయి. పాప్ స్టార్ షకీరా, సూపర్ మోడల్ క్లౌడియా స్కిఫర్, ‘లెల్ ద ఫాట్ ఒన్’ గా ప్రాచుర్యంపొందిన ఇటలీ మాఫియా డాన్ల రహస్య ఖాతాలు పండోరా పేపర్స్లో వెల్లడయ్యాయి. పరిశోధనలో కనుగొన్న వ్యక్తులు, సంస్థలు, లావాదేవీల వివరాల్ని ఐసీఐజే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు.
సమగ్ర దర్యాప్తు జరపాలి: ఆక్స్ఫామ్
పన్నుల్లేని లేదా తక్కువ పన్నులున్న దేశాలకు సంపద మళ్లుతున్నందున, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రతీ ఏటా 427 బిలియన్ డాలర్లు కోల్పోతున్నాయని, ముఖ్యంగా వర్థమాన దేశాలు బాగా నష్టపోతున్నాయని ఆక్స్ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ చెప్పారు. పండోరా పేపర్స్ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
దర్యాప్తు చేస్తాం: సీబీడీటీ
పండోరా పేపర్స్లో వెలువడిన అంశాల్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, దర్యాప్తునకు సిద్ధమైంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సంబంధిత దర్యాప్తు సంస్థలు ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తాయని, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సీబీడీటీ చైర్మన్ నేతృత్వంలో సీబీడీటీ, ఈడీ, ఆర్బీఐ, ఎఫ్ఐయూల ప్రతినిధులతో కూడిన బృందం దర్యాప్తు చేస్తుందని ప్రకటన పేర్కొంది. పండోరా పేపర్స్లో పేర్లు వెల్లడైన వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని విదేశాల నుంచి భారత ప్రభుత్వం రాబడుతుందని సీబీడీటీ తెలిపింది.
చట్టబద్ధంగానే: సచిన్, మజుందార్ షా
పండోరా పేపర్స్ వివరాల్ని కొందరు తిరస్కరించారు. తాము తప్పుడు ఆర్థిక లావాదేవీలేవీ జరపలేదని, తన భర్తకు విదేశాల్లో ఉన్న ట్రస్ట్ చట్టబద్ధమైనదని, స్వతంత్ర ట్రస్టీలు దీనిని నిర్వహిస్తున్నారని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ట్వీట్ చేశారు. అలాగే క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు.. ఆదాయపు పన్నులో డిక్లేర్ చేసినవేనని ఆయన న్యాయవాది చెప్పారు.