Supreme Court | దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ మేరకు స్పందించిన న్యాయస్థానం సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
మధ్యప్రదేశ్కు చెందిన వైద్యురాలు, సామాజిక కార్యకర్త జయ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు, యూటీలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని బాలికల పారిశుధ్యం, పరిశుభత్రలాంటి ముఖ్యమైన సమస్యను పిటిషనర్ లేవనెత్తారని, ఈ విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత సహాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది.