న్యూఢిల్లీ, మార్చి 8: రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50 శాతానికి దాటకూడదనే అంశంపై అన్ని రాష్ర్టాలు తమ అభిప్రాయాలను తెలుపాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు సోమవారం నోటీసులు పంపించింది. మహారాష్ట్రలో మరాఠా సామాజికవర్గానికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించటం, తద్వారా ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 50% దాటడానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో తీర్పు దేశమంతటా ప్రభావం చూపనున్న నేపథ్యంలో ధర్మాసం అన్ని రాష్ర్టాల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఒక సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించటంలో కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే 102వ రాజ్యాంగ సవరణ రాష్ర్టాల అధికారాలను హరిస్తుందా.. అన్న విషయంలోనూ అభిప్రాయాన్ని తెలుపాలని ఆదేశించింది.1992లో ఇందిరా సాహ్నీ కేసులో.. ‘రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు’ అన్న తమ తీర్పుపై పునఃసమీక్షపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు సుప్రీంకోర్టు నోటీసుల్లో తెలిపింది.
2018లో కేంద్రప్రభుత్వం రాజ్యాంగానికి 102వ సవరణ చేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 342Aను చేర్చారు. ఈ ఆర్టికల్ ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో బీసీలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇదే ఆర్టికల్ ద్వారా వెనుకబడిన వర్గాల జాబితాను మార్చే అధికారం పార్లమెంటుకు వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం రాష్ర్టాలకు కూడా ఇలాంటి అధికారాలే ఉన్నాయి. అయితే, ఆర్టికల్ 342A వల్ల కేంద్రం రాష్ర్టాల అధికారాలను తగ్గించిందన్న వాదనలు ఉన్నాయి.