న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో నిరసనకారులపై పోలీసు సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులే స్వయంగా నిరసనకారులపై దాడులు చేస్తున్నట్టు కనిపించడం బాధాకరమని ఆయన అన్నారు. పోలీసుల నుంచి ఆశించే నిష్పాక్షికత మాయమవుతున్నట్టు కనపడుతున్నదని అభిప్రాయపడ్డారు.
పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. కస్టోడియల్ మరణాలు, బూటకపు ఎన్కౌంటర్లు తీవ్రమైన నేరాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వీధిలో విధుల్లో ఉన్న పోలీసు అధికారి సామాన్య ప్రజలకు ప్రభుత్వ అధికారానికి ప్రతీక అని చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైనపుడు పౌరులు సహాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తారని, కాబట్టి పోలీసులపై నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యవసరమని జస్టిస్ భుయాన్ అన్నారు.