న్యూఢిల్లీ: ప్రఖ్యాత పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. కోవిడ్19 వ్యాధితో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. రిషికేశ్లోని ఎయిమ్స్లో ఆయన కోవిడ్ చికిత్స పొందారు. మధ్యాహ్నం 12.05 నిమిషాలకు బహుగుణ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ డైరక్టర్ రవికాంత్ తెలిపారు. కరోనా పాజిటివ్ తేలడంతో.. మే 8వ తేదీన ఆయన్ను హాస్పిటల్లో చేర్పించారు. గత రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ లెవల్ చాలా వరకు పడిపోయింది. ఇన్నాళ్లూ ఐసీయూలో ఆయన సీపీఏపీ థెరపీలో ఉన్నారు.
ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో ఉన్న మరోడా ఆయన స్వగ్రామం. 1974లో ఆయన చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చాలా శాంతియుతంగా ఆయన ఆ ఉద్యమాన్ని సాగించారు. ఉత్తరాఖండ్లో నిర్మించిన తెహ్రీ డ్యామ్కు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేశారు. పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. శతాబ్ధాలుగా ప్రకృతితో సహజీవనం చేసే మన జీవిన విధానానికి బహుగుణ తార్కాణమని మోదీ అన్నారు. సుందర్లాల్ మృతి దేశానికి భారీ నష్టమని, తీరని లోటు అని అన్నారు. ఆయన మృదుస్వభావాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు. బహుగుణ కుటుంబసభ్యులకు, ఆయన్ను ఇష్టపడేవారికి ప్రధాని మోదీ సానుభూతి వ్యక్తం చేశారు.
Passing away of Shri Sunderlal Bahuguna Ji is a monumental loss for our nation. He manifested our centuries old ethos of living in harmony with nature. His simplicity and spirit of compassion will never be forgotten. My thoughts are with his family and many admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 21, 2021