జాలోర్: సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ ఫైటర్ విమానాన్ని.. రాజస్థాన్లో జాలోర్లో ఉన్న జాతీయ హైవేపై ల్యాండ్ చేశారు. సుఖోయ్ యుద్ధ విమానం హైవేపై ల్యాండ్ కావడం ఇదే తొలిసారి. ఇవాళ ఎమర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్లు కూడా పాల్గొన్నారు. సుఖోయ్ విమానం ల్యాండింగ్కు ముందు.. వైమానిక దళానికి చెందిన సీ-130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని కూడా ల్యాండ్ చేశారు. ఆ విమానంలో మంత్రి రాజ్నాథ్, గడ్కరీ, ఎయిర్ చీఫ్ బదౌరియాలు ప్రయాణించారు. సుఖోయ్ తర్వాత జాగ్వార్ యుద్ధ విమానాన్ని ఆ హైవేపై దించారు.
రోడ్డు మౌళికసదుపాయాల్ని, నాణ్యతను పరీక్షించేందుకు విమానాల ల్యాండింగ్ డ్రిల్ నిర్వహించారు. ఎమర్జెన్సీ సమయంలో విమానాల కోసం ఎలా జాతీయ హైవేలాను వాడాలన్న కోణంలో ఈ పరీక్ష సాగింది. యుద్ధ సమయంలో ఎయిర్బేస్లను శత్రవులు టార్గెట్ చేస్తే, అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విధంగా డ్రిల్ నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో మొత్తం 12 హైవేలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వాడనున్నారు. ఇప్పటికే ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రదేశంగా గుర్తించారు.
2017లో ఐఏఎఫ్కు చెందిన సీ-130 సూపర్ హెర్క్యులస్, మిరాజ్2000, సుఖోయ్-30ఎంకేఔ విమానాలు.. ఆగ్రా-లక్నో హైవేపై ల్యాండ్ అయ్యాయి. మిరాజ్, సుఖోయ్లు.. యూపీలోని ఎక్స్ప్రెస్వేలపై రెండు సార్లు దిగాయి. 2015లో యమునా హైవేపై మిరాజ్ విమానాన్ని దించారు.