న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ఆ పార్టీకి రూ.60కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఉన్నతస్థాయి కమిటీ సుకేశ్ వాంగ్మూలాన్ని స్వీకరించిందని న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు తెలిపారు. రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. అతన్ని మంగళవారం పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఇదే కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సైతం కోర్టుకు హాజరైంది. ఈ సందర్భంగా సుకేశ్ తరఫు న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాతో మాట్లాడారు.
ఇవాళ ఆప్ పార్టీకి రూ.60కోట్లు ఇచ్చినట్లు సుకేశ్ ఆరోపించాడని, వాంగ్మూలాన్ని ఉన్నత స్థాయి కమిటీ స్వీకరించి, తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మనీలాండింగ్ కేసులో సుకేశ్ భార్య లీనా మరియా పాల్కు చెందిన 26 కార్లను స్వాధీనం చేసుకునేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డిసెంబర్ 23 నుంచి బహ్రెయిన్ వెళ్లేందుకు కోర్టులో దరఖాస్తు చేసింది. ఈ విషయంపై ఈ నెల 22లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నది. విలువైన బంగ్లాతో పాటు విలువైన కానుకలు సుకేశ్ స్వీకరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఈడీతో పాటు ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.