న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రతిరోజూ తీయటి పానీయాలు (స్వీట్ డ్రింక్స్) తీసుకునే మహిళలు కాలేయ క్యాన్సర్ బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 98,786 మంది పోస్ట్ మెనోపాజ్లో ఉన్న మహిళలపై అధ్యయనం చేయగా, ఇందులో 6.8శాతం మంది ప్రతిరోజూ ఒకటి లేదా అంతకుమించి స్వీట్ డ్రింక్స్ తీసుకున్నారు. వీరిలో 85శాతం మంది లివర్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని, 68శాతం మంది కాలేయ సంబంధిత వ్యాధులతో మరణించే ముప్పు ఉందని నివేదిక అంచనావేసింది.
అమెరికాలోని ‘బ్రిగం, వుమెన్స్ హాస్పిటల్’ సైంటిస్టులు ఈ నివేదికను రూపొందించారు. ‘స్వీట్ డ్రింక్స్కు తీవ్రమైన కాలేయ వ్యాధులకు సంబంధముందని చెబుతున్న మొదటి నివేదిక ఇది’ అని సైంటిస్ట్ లాంగాజ్ జావో అన్నారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వ విధానాల్ని ఎంచుకోవటంలో, లివర్ వ్యాధుల మరణాల్ని తగ్గించటంలో తమ నివేదిక దోహదపడుతుందని జావో చెప్పారు. అయితే స్వీట్ డ్రింక్స్ వాడకం కాలేయ క్యాన్సర్ మరణాలకు కారణం అవుతుందా? లేదా? అన్నదానిపై మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు జరగాల్సి వుందని సైంటిస్టులు పేర్కొన్నారు.