న్యూఢిల్లీ, ఆగస్టు 27: విపరీతంగా పెరుగుతున్న చక్కెర ధరలు రానున్న పండుగ సీజన్లో ప్రజలకు తీపిని దూరం చేయనున్నాయి. పండుగలు సమీపిస్తుండటంతో ప్రజలు స్వీట్లు, ఇతర సాంప్రదాయ వంటకాల కోసం చక్కెరను నిల్వ చేసుకుంటుండంతో దాని డిమాండ్ పెరగనున్నది. అయితే ఒకవైపు చక్కెర కోసం అధిక ధరను చెల్లిస్తున్న వినియోగదారులు మరోవైపు ఫాస్ట్-కామర్స్ ప్లాట్ఫామ్లు, ఆఫ్లైన్ రిటైలర్లు చక్కెర కొనుగోళ్లపై పరిమితులు విధించడంతో కొరతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతున్నది.
జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్లు కొన్ని చక్కెర ఉత్పత్తులపై పరిమాణ పరిమితులను విధించినట్టు తెలుస్తున్నది. ఉత్పత్తులు, ప్లాట్ఫారాలను బట్టి ఈ పరిమితులు మారుతున్నాయి. చక్కెర వినియోగం పెరుగుతుందని భావిస్తున్న తరుణంలోనే దాని ధరలు భారీగా పెరిగి వినియోగదారులు, చిల్లర వ్యాపారులపై ఒత్తిడిని పెంచుతుండటంతో ఈ పరిమితులు విధించినట్టు తెలుస్తున్నది. కొనుగోలుపై ఉన్న ఆంక్షలు భౌతిక రిటైల్ రంగానికి కూడా విస్తరించాయి. డిమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద ఆఫ్లైన్ రిటైల్ చైన్లకు చెందిన కొన్ని స్టోర్లలో ఒక్కో కస్టమర్కు చక్కెర కొనుగోళ్లను సుమారు 2-3 కిలోలకు పరిమితం చేశాయి.
ప్రభుత్వ చర్యలు
చక్కెర ధరల పెరుగుదల నేపథ్యంలో సరఫరాను మెరుగుపరచడానికి, నిల్వలను అక్రమంగా దాచి ఉంచడాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను శుద్ధి చేసిన చక్కెరగా మార్చి, దేశీయ మార్కెట్లో విక్రయించడానికి దిగుమతిదారులకు మరింత సమయం ఇస్తూ ప్రభుత్వం ముడి చక్కెరపై సుంకం లేని దిగుమతులకు సంబంధించిన నిబంధనలను సవరించింది. ఈనెల 20న జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు టారిఫ్-రేట్-కోటా కింద 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ధరలపై ఒత్తిడి ఉన్న తరుణంలో దేశీయ మార్కెట్లోకి అదనపు చక్కెరను తీసుకురావడమే సుంకం లేని దిగుమతి వెసులుబాటు లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
36,000 కోట్ల చక్కెర కుంభకోణం: విపక్షాలు
పండుగ సీజన్లో చక్కెర ధరలు పెరుగడం వల్ల నిల్వదారులు, బ్లాక్మార్కెటర్లకు లబ్ధి చేకూర్చేలా రూ.36,000 కోట్ల చక్కెర కుంభకోణానికి మోదీ ప్రభుత్వం సహకరించిందని విపక్షాలు గురువారం ఆరోపించాయి. చక్కెర కొరత గురించి ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోవడం వల్లే చక్కెర ధరలు కిలోరూ రూ.40 నుంచి రూ.75కు పెరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆగస్టు, నవంబర్ మధ్య దేశంలో సుమారు 1.20 కోట్ల టన్నుల చక్కెర వినియోగం ఉంటుందని అంచనా అని, ఈ పరిస్థితుల్లో ప్రజలు కిలోకు కనీసం అదనంగా రూ.30 చెల్లించాల్సి వస్తుందని విపక్షాలు పేర్కొన్నాయి.