బెంగళూరు: ఒక వ్యక్తితో తల్లికి ఉన్న సంబంధంపై కుమారుడు ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో ఆమెను కొట్టి చంపాడు. మృతదేహాన్ని ఒకచోటకు తరలించి దహనం చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తితో పాటు సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. (Man Kills Mother) కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మదహళ్లి గ్రామానికి చెందిన 30 ఏళ్ల శివరుద్రప్ప తన తల్లి 48 ఏళ్ల సుధాపై అనుమానం వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తితో ఆమెకు ఉన్న సంబంధాన్ని అతడు వ్యతిరేకించాడు.
కాగా, ఇటీవల ఆ వ్యక్తితో కలిసి బైక్పై తల్లి సుధ వెళ్లడాన్ని శివరుద్రప్ప చూశాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆదివారం ఉదయం తల్లిని దారుణంగా కొట్టాడు. గాయపడిన ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు బంధువులు ప్రయత్నించారు.
మరోవైపు తల్లిని తానే ఆసుపత్రికి తీసుకెళ్తానని బంధువులకు శివరుద్రప్ప చెప్పాడు. అయితే ఆమెపై మళ్లీ దాడి చేశాడు. రాయితో తలపై మోది తల్లిని హత్య చేశాడు. కనియనహుండి సమీపంలోని ఒక తోటలోకి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాడు. అక్కడ నిప్పంటించి దహనం చేసి పారిపోయాడు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. తల్లిని హత్య చేసిన శివరుద్రప్పతో పాటు అతడికి సహకరించిన కజిన్స్ అయిన 24 ఏళ్ల ఆకాష్, 22 ఏళ్ల అభిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.