హైదరాబాద్ : కలాం-250 పేరుతో అభివృద్ధి చేస్తున్న విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహనంలోని రెండో దశను విజయవంతంగా పరీక్షించినట్టు హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో బుధవారం 85 సెకన్ల పాటు ఈ పరీక్ష జరిపినట్టు పేర్కొన్నది.
విక్రమ్-1లో అధిక సామర్థ్యం కలిగిన కార్బన్ కంపోజిట్ రాకెట్ మోటార్ను వినియోగిస్తున్నారు. ఇది ఘన ఇంధనంతో పని చేస్తుంది. భారత్లో ప్రైవేటు రంగంలో తయారుచేసిన అతిపెద్ద ప్రొపల్షన్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించామని, భారత అంతరిక్ష పరిశ్రమలో మైలురాయి అని స్కైరూట్ సంస్థ సీఈవో పవన్ చందన పేర్కొన్నారు. ఈ ఏడాది విక్రమ్-1 ప్రయోగాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ దిశగా ఇది కీలక అడుగు అని ఈ సంస్థ సహవ్యవస్థాపకుడు నాగభరత్ తెలిపారు.