న్యూఢిల్లీ, జూన్ 4 : ఫలితాల పోర్టల్లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ సమస్య కారణంగా జేఈఈ(అడ్వాన్స్డ్) 2026 అభ్యర్థుల డాటా బహిర్గతమైందన్న వార్తలు, దేశ విద్యా వ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎంత అసమర్థ వ్యక్తులు నడుపుతున్నారో చూపిస్తున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం విమర్శించింది. సోషల్ మీడియాలో ప్రారంభమై ఆ తర్వాత విస్తృత రూపం దాల్చిన ఈ ఉద్యమ నాయకులు విద్యా రంగంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విఫలమయ్యారని పేర్కొంటూ ఆయనను తక్షణమే తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో సీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటన విద్యార్థుల డాటా భద్రత, పరీక్ష విధానాల నిర్వహణపై కొత్త ఆందోళనలను రేకెత్తించిందని అన్నారు. దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతమయ్యాయని ఆయన తెలిపారు. ఈ నెల 6న జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహిస్తామని ఇదివరకే ప్రకటించిన సీజేపీ ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వకున్నప్పటికీ తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించింది.