లక్నో: ఒక ఎమ్మెల్యే పట్ల పోలీసులు దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో తన హక్కుకు భంగం కలిగినట్లు (breach of privilege) అసెంబ్లీలో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్షను అసెంబ్లీ విధించింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. 2004 సెప్టెంబర్ 15న విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా కాన్పూర్లో నిరసనలు జరిగాయి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించే బృందానికి బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో శాసన సభ తనకు కల్పించిన ప్రత్యేక హక్కులకు భంగం కలిగినట్లు ఆయన ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో నాడు ఫిర్యాదు చేశారు.
కాగా, సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఆ ఎమ్మెల్యే ఫిర్యాదుపై ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ చర్యలు చేపట్టింది. సోమవారం అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. శాసన సభ్యుడు సలీల్ విష్ణోయ్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. శుక్రవారం ఈ శిక్షను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో కాన్పూర్ నగర్లోని బాబుపూర్వలో నాడు సీఐగా విధుల్లో ఉండి ప్రస్తుతం రిటైర్డ్ అయిన అబ్దుల్ సమద్, నాటి కిద్వాయ్ నగర్ ఎస్హెచ్వో శ్రీకాంత్ శుక్లా, నాడు ఎస్సైగా ఉన్న త్రిలోకి సింగ్, పోలీస్ కానిస్టేబుళ్లు చోటే సింగ్, వినోద్ మిశ్రా, మెహర్బన్ సింగ్కు సమన్లు జారీ చేయాలని ఆదేశించింది.
మరోవైపు ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులు అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం కోర్టుగా మారింది. ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్ష విధించే తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ సతీష్ మహానా ఆ తీర్పును వెల్లడించారు. అసెంబ్లీకి హాజరైన ఆరుగురు పోలీసులు నాటి సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. శిక్షలో భాగంగా ఆ పోలీసులను అసెంబ్లీలోని ఒక గదిలో శుక్రవారం అర్ధ రాత్రి వరకు ఉంచారు. వారికి ఆహారం, తాగు నీరు వంటి వసతులు కూడా కల్పించారు.