న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో జడ్జి పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉండటం, మౌలిక వసతుల కొరత న్యాయవ్యవస్థకు సవాళ్లుగా మారాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శనివారం జస్టిస్ రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిల నియామకంపై కొలీజియం సిఫారసులను వెంటనే ఆమోదించడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 41% జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కొలీజియం శుక్రవారం సిఫారసు చేసిన 68 మంది సహా హైకోర్టు జడ్జిలుగా మొత్తం 82 మంది పేర్లు ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జడ్జిల నియామక ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తుందని జస్టిస్ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుపై సమగ్ర ప్రతిపాదనను త్వరలోనే కేంద్రానికి పంపుతానన్నారు. ఇందుకోసం అన్ని కోర్టుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు.
మహిళల భాగస్వామ్యం తక్కువ
న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు 50% రిజర్వేషన్పై చాలా కాలంగా మాట్లాడుతున్నామని, ఎంతో కష్టపడితే సుప్రీంకోర్టు జడ్జిల్లో ప్రస్తుతం మహిళలకు 11% ప్రాతినిధ్యం లభించిందని తెలిపారు. న్యాయవాద వృత్తి కేవలం ధనవంతుల కోసమేన్న భావన బలంగా ఉన్నదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ భావన నుంచి బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే లాయర్ వృత్తి ఇప్పటికీ పట్టణాలకే పరిమితం అయిందని అన్నారు.
న్యాయ వ్యవహారాల్లో దిట్ట
‘జస్టిస్ రమణ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం కలవారని ఆయనను కలిసిన తర్వాత తెలిసింది’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. భారత న్యాయవ్యవస్థ సామాన్యుడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని రిజిజు అభిప్రాయపడ్డారు. దిగువ కోర్టుల్లో సామాన్యులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతున్నదన్నా రు. ‘న్యాయవ్యవస్థలో జస్టిస్ రమణ ఒక కొత్త ఉదయం’ అని పొగిడారు. కాగా, జస్టిస్ ఎన్వీ రమణ ‘ఉత్తమ న్యాయమూర్తే కాక మంచి మనిషి కూడా’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. న్యాయవ్యవహారాల్లో దిట్ట అని, నిష్పక్షపాతంగా ఉంటారని కొనియాడారు.
సీజేఐకి బాలిక లేఖ.. ‘పిల్’గా స్వీకరణ
దేశవ్యాప్తంగా మార్కెట్లు, దుకాణాలు, సినిమా థియేటర్లు ఆఖరికి బడులు కూడా తెరిచినప్పుడు సుప్రీంకోర్టులో పూర్తిగా ప్రత్యక్ష విచారణ ఎందుకు చేపట్టకూడదని ప్రశ్నిస్తూ ఓ బాలిక సీజేఐ జస్టిస్ రమణకు లేఖ రాసింది. సన్మాన కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వినీత్ సరణ్ ఈ లేఖ విషయాన్ని చెప్పారు. ‘ఆ లేఖను ప్రజాహిత వ్యాజ్యం(పిల్) కింద పరిగణనలోకి తీసుకొని విచారించాలని జస్టిస్ రమణ నిర్ణయించార’ని తెలిపారు. గతంలో కూడా కేరళకు చెందిన 5వ తరగతి బాలిక జస్టిస్ రమణకు లేఖ రాసింది. సెకండ్ వేవ్లో ఆక్సిజన్ సరఫరాపై సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంపై కృతజ్ఞతలు తెలిపింది.