ముంబై: సోషల్ మీడియాలో పోస్ట్ కోసం రీల్ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు విద్యార్థులు చిక్కుల్లోపడ్డారు. ఫ్రాంక్ కిడ్నాప్ వీడియో తీయబోయి భంగపడ్డారు. (Shooting Prank For Reel) ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంఘటన జరిగింది. చంద్రాపూర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల ఆదేశ్, స్నేహితుడితో కలిసి నాగపూర్ ప్రతాప్ నగర్లోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న అతడు జేఈఈ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.
కాగా, సోమవారం ఉదయం 6.45 గంటలకు ఆదేశ్ తన స్నేహితులతో కలిసి నడుస్తూ క్లాస్ రూమ్కు వెళ్తున్నాడు. ఇంతలో ఒక కారు అతడి ముందు ఆగింది. ముగ్గురు యువకులు అందులోంచి కిందకు దిగారు. కారులోకి ఎక్కాలని ఆదేశ్ను బలవంతం చేశారు. ఆదేశ్ స్నేహితులు కేకలు వేయడంతో కారులో అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు తనను కిడ్నాప్ చేయబోవడం పట్ల భయాందోళన చెందిన ఆదేశ్ ఈ విషయాన్ని టీచర్కు చెప్పాడు. ఆ వెంటనే ఉపాధ్యాయుడితో కలిసి స్థానిక పోలీస్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. 18 ఏళ్ల సుశాంత్ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో 18 ఏళ్ల వయసున్న శ్రేయాష్, యష్, అర్నవ్ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆ నలుగురు యువకులను పోలీసులు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రీల్ కోసం ఫ్రాంక్ వీడియో తీసేందుకు ప్రయత్నించినట్లు వారు చెప్పారు. ఇద్దరు యువకులు ఇంటర్ పరీక్షలు రాయగా, మరో ఇద్దరు నీట్కు ప్రిపేర్ అవుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు రప్పించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల పేరెంట్స్ షాక్ అయ్యారు. వారి భవిష్యత్తు దృష్ట్యా పోలీసులను ప్రాధేయపడ్డారు. దీంతో నలుగురు విద్యార్థులను తీవ్రంగా హెచ్చరించి వదిలేశారు.