గురుగ్రామ్: అవి రెండు శునకాలు. అయితేనేం తమ సొంత పిల్లల్లా పెంచుకున్నారు వాటి యమానులు. ఇరుగుపొరుగున ఉండేవారికి ఆ రెండు కుక్కలకు పెండ్లి చెయ్యాలనే తలంపు వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవు.. నాలుగు రోజుల్లోనే వాటికి పెండ్లి చేశారు. అదీ సాదాసీదాగా కాదండోయ్.. అచ్చం మనుషుల పెండ్లి ఎలాచేస్తారో అలాగే. బాజా భజంత్రీలు, డీజే చప్పుళ్లతో జరిగిన ఆ పెంపుడు జీవుల వివాహానికి బంధువులు కూడా పెద్దసంఖ్యలో హాజరవడం విశేషం.
హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన రాణి, మనీత ఇరుగుపొరుగున ఉంటున్నారు. వారికి స్వీటీ (ఆడ శునకం), షేరూ అనే పెంపుడు కుక్కలు ఉన్నాయి. రాణి దంపతులకు సంతానం లేకపోవడంతో స్వీటీని తమ కన్నబిడ్డలానే పెంచుకుంటున్నారు. అయితే స్వీటీ పెద్దదయిపోయింది.. ఇక దానికి పెండ్లి చేయండి అని అంతా అంటుండేవారని, మొదటి తాము వారిని పట్టించుకోలేదని రాణి చెప్పారు. అయితే పొరుగునే ఉన్న మనీత.. తమ షేరూతో స్వీటీకి పెండ్లి చేద్దామని తనతో చెప్పిందని.. దీంతో తాము కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నామని వెల్లడించింది. ఇంకేముంది వాటికి పెండ్లి చేద్దామని నిర్ణయించుకున్న నాలుగు రోజుల్లోనే ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె పేర్కొంది.
హిందూ సాంప్రదాయంలో వాటికి వివాహం చేద్దామని నిర్ణయించుకున్నామని మనీతా అన్నారు. మొత్తం వంద మందిని వివాహానికి ఆహ్వానించామని చెప్పారు. 25 కార్డులు ముద్రించి పంచామని, మిగతావారికి ఆన్లైన్లో, ఫోన్ ద్వారా ఆహ్వానించామన్నారు. వివాహానికి మందురోజు ఆ రెండు శునకాలకు హల్దీ వేడుక కూడా నిర్వహించామన్నారు.
పెండ్లికి వచ్చినవారు ఆ రెండు కుక్కల పెండ్లి తంతుని ఎంజాయ్ చేశారని, డ్యాన్సులు కూడా చేశారని రాణి అన్నారు. అయితే ఆహ్వాన సమయంలో కొందరు వింతగా ఉందని, తాము పెండ్లికి వస్తామని చెప్పారని, మరికొందరు పట్టించుకోలేదని, కుక్కలకు పెండ్లి ఏంటని ప్రశ్నించారని ఆమె తెలిపారు. అయినా తాము వేటినీ పట్టించుకోవలేదని, తాము అనుకున్న విధంగా షేరూ, స్వీటిని ఓ జంటను చేశామన్నారు.