ముంబై: బాలీవుడ్ యువ నటి తునీషా ఆత్మహత్యకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ముందుగా ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. ఆ తర్వాత తునీషా సహ నటుడు షీజాన్ ఖానే ఆమెకు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అనుమానించి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతనికి ముంబైలోని వాసాయ్ కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
పోలీసుల అనుమానాన్ని బలపర్చేలా తునీషా కుటుంబసభ్యులు కూడా షీజాన్పైనే ఆరోపణలు చేస్తున్నారు. షీజాన్ ఖానే తునీషాను ఆత్మహత్యకు పురికొల్పాడని ఆదివారం ఆమె సమీప బంధువు పవన్ శర్మ ఆరోపించగా.. తాజాగా ఇవాళ తునీషా తల్లి వనితా శర్మ కూడా షీజాన్ తమ కుమార్తెను మోసం చేశాడని విమర్శించారు. అంతేగాక అతనికి మరికొంత మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
షీజాన్ ఖాన్ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని, అతనికి శిక్షపడి తీరాల్సిందేనని వనితా శర్మ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఓ సీరియల్ షూటింగ్ సెట్లోనే నటి తునీషా శర్మ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె సహ నటుడు షీజాన్ ఖాన్ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. కాగా, రేపు తునీషా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.