న్యూఢిల్లీ\త్రిసూర్ : కేరళలో హిందూయేతర నృత్య కళాకారిణిని ఆలయ ప్రాంగణంలో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇది సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని పలువురు ఆలయ అధికారుల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. త్రిసూర్కు సమీపంలోని ఇరింజలకుదలోని కూడాల్మాణికన్ ఆలయంలో పదిరోజుల పాటు జరిగే జాతీయ నృత్య సంగీతోత్సవంలో భరతనాట్య కళాకారిణి వీపీ మన్సియ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కార్యక్రమంలో ఆమె ప్రదర్శనను పొందుపరిచినా ఆమెకు అనుమతి నిరాకరించామని ఆలయ అధికారులు సోమవారం నృత్య కళాకారిణికి తెలిపారు.
మన్సియకు ఫోన్ చేసిన అధికారులు ఆమె నృత్య ప్రదర్శన కార్యక్రమం నుంచి తొలగించామని తెలిపారు. ఎందుకు అలా చేశారని ఆమె అడగ్గా, హిందూయేతరులను ఆలయంలోకి అనుమతించమని వారు చెప్పారని మన్సియ వెల్లడించింది. ఈ ఉదంతంపై కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ స్పందించారు. సహచర హిందువులు మన దేవాలయాలను ఇతరులకు అనుమతించడం లేదని ఇక వసుధైక కుటుంబం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.
కొన్ని ఆలయాల్లో గర్భ గుడిలోకి ఎవరినీ అనుమతించరని, ఆ నియంత్రణలను అర్ధం చేసుకోగలమని, కానీ ఇది నృత్య ప్రదర్శన మాత్రమేనని ఇతర నృత్య కళాకారిణులను అనుమతిస్తూ ఇలా మరొకరిని అనుమతించకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇది మన సమాజానికి చేటు చేస్తుందని, ఇతరుల దృష్టిలో మన మతం ప్రతిష్టను దెబ్బతీస్తుందని శశి ధరూర్ ఆందోళన వ్యక్తం చేశారు.