న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినవేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ తదుపరి సమావేశంలో ఈ ఫలితాలపై విశ్లేషణ జరుపుతామని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ నెల 6న ‘భారత్’ కూటమి తదుపరి సమావేశం జరుగనున్నది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శనపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) జనరల్ సెక్రటరీ నిఖిల్ స్పందించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘భారత్’ కూటమికి నాయకత్వం వహించాలని ఆయన సూచించారు. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ నిమగ్నమైంది. కూటమిని పట్టించుకోలేదు. అయినప్పటికీ బాగా పనిచేయలేదని ఫలితాల్లో వెల్లడైంది’ అని అన్నారు. ‘భారత్’ కూటమికి రూపశిల్పి అయిన నితీశ్ కుమార్ మాత్రమే దానికి నేతృత్వం వహించగలరని వ్యాఖ్యానించారు.
మరో జేడీయూ నేత కేసీ త్యాగి కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ‘‘ఇండియా’ కూటమిని కాంగ్రెస్ విస్మరించింది. అయినప్పటికీ సొంతంగా గెలువలేకపోయింది’ అని విమర్శించారు.