న్యూఢిల్లీ, మే 27: లఢక్లోని తుర్తుక్ సెక్టార్లో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన 60 అడుగుల లోతులో ఉన్న ష్యోక్ నదిలోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సైనికులు మరణించారు. 19 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 26 మంది సైనికులు ఉన్నారు. వారంతా పార్తాపూర్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టార్కు వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. గాయపడ్డ సైనికులను వెంటనే పార్తాపూర్లోని 403 ఫీల్డ్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి చండీమందిర్లోని దవాఖానకు తీసుకెళ్లారు. ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన సైనికుల కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): జవాన్ల మృతి పట్ల మంత్రి హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. ‘మన జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుం బ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): లఢక్లో మృతి చెందిన భారత సైనికులకు ఎమ్మెల్సీ కవిత సంతాపం ప్రకటించారు. ‘మన సైనికులు మరణించడం తీవ్రంగా బాధించింది. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.