ప్రపంచాన్ని గత మూడేళ్లు కరోనా అతలాకుతలం చేసింది. టీకాలు, కఠినమైన నిబంధనలతో కొవిడ్ శాంతించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో మహమ్మారి మంకీపాక్స్ కలవరపెడుతోంది. మంకీపాక్స్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో ప్రపంచ ఆరోగ్య అత్యవసరస్థితిని ప్రకటిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రెయెసెస్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ మహమ్మారికి టీకాలు తయారుచేస్తారా? అనే ప్రశ్నకు ఇండియాలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ అధర్ పూనావాలా సమాధానమిచ్చారు. ఈ విషయంపై మంగళవారం ఆయన మాట్లాడారు.
మంకీపాక్స్ వైరస్ మహమ్మారిగా మారే అవకాశం లేదని, దీనికి వ్యాక్సిన్ను తయారు చేసే ఆలోచన తమ కంపెనీకి లేదని అధర్ పూనావాలా స్పష్టంచేశారు. కానీ, మశూచి వ్యాక్సిన్ (స్మాల్ పాక్స్)ను దిగుమతి చేసుకుంటామని చెప్పారు. 2-3 నెలల్లో స్టాక్ అందుబాటులోకి వస్తుందని పూనావాలా స్పష్టంచేశారు. అందరూ డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సూచించారు.