న్యూఢిల్లీ: సహారా గ్రూప్ సంస్థల చీఫ్ సుబ్రతా రాయ్ను స్వయంగా కోర్టుకు హాజరుకావాలని బీహార్ హైకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది. సహారాలో పెట్టుబడులు పెట్టిన వారికి ఆ సొమ్ములను తిరిగి ఇచ్చే అంశంపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 16న భౌతికంగా కోర్టుకు హాజరుకావాలని బీహార్లోని పాట్నా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే సుబ్రతా రాయ్ ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, జేబీ పార్దివాలాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. సుబ్రతా రాయ్ను కోర్టుకు హాజరుకావాలన్న పాట్నా హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది.
కాగా, 2012 ఆగస్ట్ 31 నాటికి ఇన్వెస్టర్లకు రూ.24,000 కోట్లు చెల్లించడంలో సహారా గ్రూప్ విఫలమైంది. దీంతో అరెస్టైన సుబ్రతా రాయ్ రెండేళ్లపాటు జైల్లో ఉన్నారు. అనంతరం తాత్కాలిక బెయిల్పై విడుదలయ్యారు. అయితే సహారా గ్రూప్ సంస్థ ఇన్వెస్టర్లకు ఇంకా రూ.9,000 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తుల వేలానికి సెబీ ప్రయత్నించింది. అయితే సహారా గ్రూప్ అడ్డంకులు సృష్టించడంపై సుప్రీంకోర్టును సెబీ ఆశ్రయించింది. కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కారం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.