న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధి(ఎన్సీఆర్)లోని ప్రాంతాల్లో కాలుష్య నివారణకు ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాలుష్య నివారణకు ఏం చేస్తారో 24 గంటల్లోగా తమకు చెప్పాలని, కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఢిల్లీ, కేంద్రప్రభుత్వాలను గురువారం ఆదేశించింది. గాలి నాణ్యత అంతకంతకూ పడిపోతున్నదని, సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఆలోచించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సూచించింది. ‘కోర్టు భుజాలపై తుపాకీ పెట్టి కాల్చుతామంటే కుదరదు’ అని ఈ వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూడవద్దని స్పష్టం చేసింది. కానీ, కాలుష్య నివారణలో విఫలం అయితే మాత్రం ‘అసాధారణమైన నిర్ణయం’ తీసుకొంటామని హెచ్చరించింది.
కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎర్ర లైటు పడగానే బండిని ఆఫ్ చేయండి’ విధానాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఇది ఒక పాపులర్ నినాదమే తప్ప క్షేత్ర స్థాయిలో ఫలితం ఏమీ లేదని పేర్కొన్నది. బడులు తెరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దలు వర్క్ ఫ్రం హోం చేస్తుంటే.. పిల్లలు కాలుష్యంలో బడికెళ్లడం ఏంటని ప్రశ్నించింది. ‘మీరు మా ఆదేశాల కోసమే ఎదురు చూస్తున్నట్టయితే ఆదేశాలిస్తాం. మీ ప్రభుత్వాన్ని నడిపేందుకు వేరేవాళ్లను నియమిస్తాం’ అని ఘాటుగా హెచ్చరించింది.
కాలుష్యం వల్ల ఢిల్లీలో బడులను మళ్లీ మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఢిల్లీలో అన్ని బడులు మూసే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నది. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయని వెల్లడించింది. గాలి కాలుష్యంతో నవంబర్ 13 నుంచి బడులను మూసివేశారు. సోమవారం నుం చి ప్రారంభించారు. ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.