న్యూఢిల్లీ: జీ తమిళ ఛానల్లో ప్రసారం అయిన ఓ రియాల్టీ షోపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నోటీసులు జారీ చేసింది. చిన్నపిల్లలతో రూపొందించిన జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4 రియాల్టీ షోను జీ తమిళ ఛానల్ ప్రసారం చేసింది. అయితే జనవరి 15వ తేదీన ప్రసారం అయిన ఎపిసోడ్లో.. ప్రధాని మోదీ చేపట్టిన పథకాలు, సంస్కరణలను తప్పుపడుతూ చిన్నపిల్లలు నాటకం చేశారు. ఆ ఎపిసోడ్పై తమిళనాడు బీజేపీ యూనిట్ ఫిర్యాదు చేసింది. పదేళ్లు కూడా నిండని పిల్లలు ప్రధాని మోదీపై సెటైర్ షో చేయడం ఏంటని, ప్రభుత్వ విధానాలు తెలియనివారితో ఎలా షో నిర్వహిస్తారని బీజేపీ తన ఫిర్యాదులో తెలిపింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీటీఆర్ నిర్మల్ కుమార్ ఈ ఫిర్యాదు ఇచ్చారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఆ పాపులర్ స్కిట్కు నటి స్నేహ యాంకరింగ్ చేసింది. 2006లో రిలీజైన 23వ పులకేసి చిత్రం అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో హీరో పాలన తరహాలో.. మోదీ పాలన ఉన్నట్లు పిల్లలు తమ షోలో సెటైర్ వేశారు. షోలో పాల్గొన్న యాంకర్లు, జడ్జిలు కూడా ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఛానల్పై చర్యలు తీసుకోవాలని సమాచార, ప్రసార శాఖను కోరారు. అయితే ఫిర్యాదుపై ఏడు రోజుల్లోగా స్పందించాలని సమాచార శాఖ సదరు ఛానల్కు నోటీసులు ఇచ్చింది.