లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ముందు ఈవీఎంలకు కాపలా కాసిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 10న కౌంటింగ్కు ముందు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో కౌంటింగ్ కేంద్రం నుంచి ఈవీఎంలను చోరీ చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద కాపాలా ఉండాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యూపీలోని 75 జిల్లాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ముందు రోజు రాత్రంతా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చిపోయే ప్రభుత్వ వాహనాలను తనిఖీ చేశారు.
కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ కార్యకర్తలపై ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వ వాహనాలను అడ్డుకుని అనధికారికంగా తనిఖీ చేసినందుకు ప్రభుత్వ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బస్తి జిల్లాలో సుమారు వంద మంది ఎస్పీ కార్యాకర్తలపై ఏడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
అలాగే హాపూర్లో పేర్లు నమోదు చేసిన ఆరుగురు ఎస్పీ కార్యకర్తలతోపాటు గుర్తించని మరో 30 మందిపై కేసులు నమోదు చేశారు. కౌంటింగ్కు ముందు కేంద్రాల వద్ద ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నారని, వారిపై చేయి చేసుకుని విధులకు ఆంటకం కలిగించారని ఆరోపించారు. ఈ నెల 11న హర్దోయ్లో సుమారు వంద మంది ఎస్పీ కార్యకర్తలపై ఇలాంటి కారణాలతో కేసులు నమోదు చేయడంతోపాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.