లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 159 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ సోమవారం విడుదల చేసింది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మొయిన్పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి, అఖిలేష్ బాబాయ్, ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ (లొహియా) చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ జస్వంత్ నగర్ నుంచి పోటీ చేయనున్నారు.
జైలు శిక్ష అనుభవిస్తూ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్టీ నేత ఆజం ఖాన్కు రాంపూర్ సీట్ను కట్టబెట్టారు. పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆజం ఖాన్ ఫిబ్రవరి 2020 నుంచి యూపీలోని సీతాపూర్ జైలులో ఉన్నారు. మరోవైపు అప్నాదళ్, నిషాద్ పార్టీలతో జోడీ కట్టిన బీజేపీ యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని వ్యూహాలకు పదునుపెడుతుండగా, బీజేపీ సర్కార్పై నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, దళితులు, మైనారిటీల, అగ్రవర్ణాల మద్దతుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ ముందుకెళుతోంది. ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.