ముంబై: జైపూర్-ముంబై రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్(RPF Constable Chetan Singh:) జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో సోమవారం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఆర్పీఎప్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూర్టీ కమీషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. చేతన్ సింగ్ ప్రవర్తన సరిగా లేదని, గతంలో అతను మూడుసార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు.
2017లో ఓ ముస్లిం వ్యక్తిని వేధించాడని, ఉజ్జయినిలో డాగ్ స్క్వాడ్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఘటన జరిగిందని అధికారి చెప్పారు. ఓసారి గుజరాత్లో పనిచేస్తున్నప్పుడు తన సహోద్యోగిని కొట్టాడు. మరోసారి తనతో పనిచేసే వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసినట్లు చేతన్పై ఆరోపణలు ఉన్నాయి. అయితే జైపూర్ రైలులో సీనియర్ను కాల్చి చంపిన ఘటన ఆధారంగా అతన్ని సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చేతన్ సింగ్ ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.
ఆ రోజు ఏం జరిగిందంటే..
జూలై 31న జైపూర్-ముంబై రైలులోని బీ2 బోగీలో ఉన్న ఓ ప్రయాణికుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కానిస్టేబుల్ చేతన్ బెదిరించాడు. అంతేకాదు తుపాకీని గురిపెట్టి ఆ ప్రయాణికుడిని ప్యాంట్రీ కార్ వద్దకు తీసుకువెళ్లినట్లు కొందరు చెబుతున్నారు. అక్కడ ఆ ప్రయాణికుడిని చేతన్ షూట్ చేశాడు. జీర్పీఎఫ్ పోలీసులు తమ విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు.
33 ఏళ్ల చేతన్ సింగ్.. సీనియర్ టికా రామ్ మీనాను కూడా షూట్ చేశాడు. పాల్గర్ రైల్వే స్టేషన్ దగ్గర తన వద్ద ఉన్న ఆటోమెటిక్ వెపన్తో మరో ముగ్గుర్ని ప్రయాణికుల్ని కూడా కాల్చేశాడతను. అయితే బీ2 ఏసీ బోగీలో ట్రావెల్ చేస్తున్న సయ్యిద్ అనే ప్రయాణికుడిని గన్పాయింట్లో బెదిరిస్తూ ప్యాంట్రీ కారు వద్దకు తీసుకువెళ్లినట్లు జీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. బీ2, బీ1 కోచ్లను దాటేసి ప్యాంట్రీ కార్ చేరుకున్నారని, దాన్ని ఇతర ప్రయాణికులు చూసినట్లు చెప్పారు.
అయిదు బోగీల్లో ఉన్న ప్రయాణికుల నుంచి జీఆర్పీఎఫ్ పోలీసులు సమాచారాన్ని రాబట్టారు. డజన్ల సంఖ్యలో ప్రయాణికుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. నిందితుడు చేతన్ సింగ్పై మెడికల్ పరీక్షలు నిర్వహించారు. అయితే అతను ఏ ఉద్దేశంతో కాల్పులకు తెగించాడో స్పష్టంగా తెలియదు.
అబ్దుల్ ఖాదర్భాయ్ మొహమ్మద్ హుస్సేన్, అస్గర్ అబ్బాస్ షేక్, సయ్యిద్ ఎస్ అనే ప్రయాణికుల్ని చేతన్ షూట్ చేశాడు. బీ5 కోచ్లో ఉన్న ఓ ప్రయాణికుడు, ఎస్6లో ఉన్న మరో ప్రయాణికుడిని అతను హతమార్చాడు. బీ5 నుంచి ఎస్6 బోగీ మధ్య దాదాపు 8 బోగీలు ఉన్నాయి. అయితే కానిస్టేబుల్ చేతన్ ఆ ముగ్గుర్ని ఎందుకు చంపాడో క్లారిటీ లేదు.