న్యూఢిల్లీ, జూలై 18: గత ఆదివారం జరిగిన నీట్ యూజీ-2022 పరీక్షలో రిగ్గింగ్ రాకెట్ బయటపడింది. ఢిల్లీ, హర్యానాల్లోని పలు సెంటర్లలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారు. ఈ మాల్ప్రాక్టీస్ ఘటనకు సంబంధించి కీలక సూత్రధారి సుశీల్ రంజన్తో సహా ఎనిమిది మందిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. అసలైన అభ్యర్థుల బదులుగా వేరేవారితో పరీక్ష రాయించేందుకు అధిక మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. ఈ నెల 17న జరిగిన నీట్ యూజీ పరీక్షల్లో.. అసలు అభ్యర్థుల యూజర్ ఐడీలు, పాస్వర్డులు సేకరించిన నిందితులు.. తాము అనుకుంటున్న ఎగ్జామ్ సెంటర్ కేటాయించేలా అవసరమైన మార్పులు చేసినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నది. అదేవిధంగా నకిలీ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేలా ఫోటోల మిక్సింగ్, మార్ఫింగ్కు పాల్పడినట్టు సీబీఐ ఆరోపిస్తున్నది.
నిందితులు కంప్యూటర్ గ్రాఫిక్స్ను ఉపయోగించి గుర్తింపు కార్డులను మార్ఫింగ్ చేసి పరీక్ష హాల్లోకి ప్రవేశించారని ఎఫ్ఐఆర్ వివరించింది. నిందితులందరూ పరీక్షకు ఒకరోజు ముందు అంటే శనివారం ఢిల్లీ చేరుకొని ఓ హోటల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ, హర్యానా కేంద్రంగాఈ రాకెట్ పనిచేసిందని వెల్లండిచారు. ఢిల్లీలోని గౌతమ్ నగర్కు చెందిన సుశీల్ రంజన్ అనే వ్యక్తిని కీలక సూత్రధారిగా గుర్తించిన సీబీఐ.. అతడితోపాటు ముఠా సభ్యులు, తప్పుడు పేర్లతో పరీక్ష రాసిన 8 మందిని అరెస్టు చేసింది. వారిపై 123బీ, 419, 420, 467, 466, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. కాగా, ఈ ముఠా గురించి సీబీఐకి ముందే తెలుసునని, అయితే పరీక్ష పూర్తయ్యే వరకు అధికారులు వేచిచూశారని, అనంతరం కుట్రదారులతో పాటు నకిలీ అభ్యర్థులను రెడ్హ్యాండెడ్గా అరెస్టు చేసిందని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొన్నది.