న్యూఢిల్లీ: రిజర్వేషన్ పాలసీని సమీక్షించాలని హెచ్ఎంఏ(సెక్యులర్) పార్టీ డిమాండ్ చేసిన దరిమిలా కేంద్ర మంత్రి జితన్రామ్ మాంఝీని రాజీనామా చేయాలని మరో కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కోరడంతో ఎన్డీఏలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒక అంశంపై ఇద్దరు కేంద్ర మంత్రులు వాదనకు దిగడం శనివారం చోటుచేసుకుంది. ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థలోనే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను(సబ్ కోటా) మాంఝీకి చెందిన హెచ్ఎంఏ సమర్థించడంతో ఈ ఇద్దరు బీహార్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందేలా చూడటానికి సమీక్ష అవసరమని మాం ఝీ కుమారుడు, బీహర్ మంత్రి సుమన్ అన్నారు. హెచ్ఎంఏ వాదనలను తిప్పికొడుతూ, ఎస్సీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ, క్రీమీలేయర్ ఉండాలని ఆ పార్టీ కోరుకుంటే మంత్రులుగా ఉన్న మాంఝీ, సుమన్ ఇద్దరూ రాజీనామా చేయాలని చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. క్రీమీలేయర్ ఎందుకు ఉండకూడదని అడుగుతున్నవారు మందుగా రిజర్వేషన్ల ప్రయోజనాలను వదులుకోవాలన్నారు.