న్యూఢిల్లీ, నవంబర్ 30: ఎవరికైనా అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి ప్రాథమిక దశలో ఉంటే సాధారణ మూత్ర పరీక్ష ద్వారా గుర్తించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. మూత్రంలో యూరినరీ ఫార్మిక్ యాసిడ్ మోతాదు అధికంగా ఉంటే అల్జీమర్స్ వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నట్టు అని గుర్తించారు. వివిధ స్థాయిల తీవ్రత కలిగిన అల్జీమర్స్ రోగుల బృందానికి మూత్ర పరీక్షలు నిర్వహించారు. అలాగే సాధారణ వ్యక్తులకు మూత్ర పరీక్షలు జరిపారు.
సాధారణ వ్యక్తులతో పోలిస్తే అల్జీమర్స్ రోగుల్లో యూరినరీ ఫార్మిక్ యాసిడ్ స్థాయిలు గణనీయంగా పెరిగాయని పరిశోధకులు కనుగొన్నారు. అల్జీమర్స్ రోగులతోపాటు సాధారణ ఆరోగ్య కార్యకర్తలు కలిపి మొత్తం 574 మందిపై అధ్యయనం చేసినట్టు వైద్య పరిశోధకులు తెలిపారు. ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.