న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ల వ్యవహారం అధికారంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), మున్సిపల్ కార్పొరేషన్లు పాలిస్తున్న బీజేపీ మధ్య వార్ కొనసాగుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్లలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలను బుల్డోజర్లతో బీజేపీ పరిపాలనా యంత్రాంగం తొలగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆగ్నేయ ఢిల్లీలోని మదన్పూర్ ఖాదర్ ప్రాంతానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, గురువారం ఆ ప్రాంతంలో కూల్చివేతలను ఆపడానికి ప్రయత్నించగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
కాగా, ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తాకు ఆప్ హెచ్చరిక జారీ చేసింది. ఆయన ఇల్లు, కార్యాలయం ప్రభుత్వ భూమిని ఆక్రమించాయని ఆరోపించింది. శనివారం ఉదయం 11 గంటలలోగా ఆ ఆక్రమణలను ఆదేశ్ గుప్తా తొలగించాలని ఆప్ డిమాండ్ చేసింది. లేకపోతే ఆయన ఇల్లు, ఆఫీస్కు బుల్డోజర్లతో వెళ్తామని హెచ్చరించింది.
‘ఆదేశ్ గుప్తా తన ఇల్లు, కార్యాలయం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. మేం ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శనివారం ఉదయం 11 గంటలలోగా ఆక్రమణలను ఆయన తొలగించాలి. లేకపోతే మేం బుల్డొజర్లతో అక్కడకు వెళ్తాం’ అని ఆప్ శుక్రవారం ఒక ప్రకటనలో వార్నింగ్ ఇచ్చింది.