డెహ్రాడూన్: మహిళల టోర్న్ జీన్స్పై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎక్కువ రేషన్ బియ్యం కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని తీరత్ సింగ్ ఆ రాష్ట్ర ప్రజలకు సూచించారు. అంతేకానీ ఎక్కువ రేషన్ వస్తున్న వారిని చూసి అసూయ చెందవద్దన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో అదనంగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని కొందరు అమ్ముకొన్నారన్న విమర్శలపై ఆయన ఇలా స్పందించారు.
భారత్ను 200 ఏండ్లు పాలించిన అమెరికా!
భారత దేశాన్ని అమెరికా 200 ఏండ్లు పాలించిందని తీరత్ సింగ్ అన్నారు. కొవిడ్ కట్టడిలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ మెరుగ్గా ఉందని పొగిడే క్రమంలో ఆయన ‘మన దేశాన్ని 200 ఏండ్లు పాలించిన అమెరికా కూడా ఇవాళ కొవిడ్ కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నది’ అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘మా చరిత్ర పాఠాల్లో ఈ విషయం ఎక్కడా లేదే’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.