థాణె: మహిళలపై పతంజలి చీఫ్, యోగా గురు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బట్టలు లేకపోయినా మహిళలు బాగానే ఉంటారని వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్మీడియాలో దుమారం రేగుతున్నది. మహిళా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మహారాష్ట్రలోని థాణెలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సైన్స్ శిబిరం, మహిళల సదస్సులో బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలు చీరలో బాగుంటారు. సల్వార్ సూట్లోనూ బాగా కనిపిస్తారు. బట్టలు లేకున్నా నా కళ్లకు అందంగానే కనిపిస్తారు’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ పాల్గొన్న కార్యక్రమంలో రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.