Rajnath Singh : దేశంలో మిస్సైల్స్ తయారీలో కీలక మార్పు రాబోతుంది. ఇప్పటివరకు డీఆర్డీవోకే పరిమితమైన మిస్సైల్స్ తయారీ టెక్నాలజీ ఇకపై ప్రైవేటు సంస్థలకు కూడా అందుబాటులోకి రానుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇందుకు అనుమతిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. డీఆర్డీవో వద్ద ఉన్న టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు అందిస్తారు.
ఇది రక్షణ రంగంలో ఆయుధాల ఉత్పత్తికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భారతీయ రక్షణ రంగంలో ఇప్పుడు ప్రైవేటు సంస్థలు కూడా భాగమవుతున్నాయి. గతంలో ప్రభుత్వం మాత్రమే ఆయుధాల తయారీ, నిఘా పరికరాల తయారీ వంటివి చేపట్టేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేటు రంగంలో కూడా వీటిని అనుమతించింది. అయితే, అది పరిమితంగానే. దీంతో అనేక సంస్థలు ఆయుధాల తయారీ రంగంలో కొనసాగుతూ, ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి భారతీయ క్షిపణి తయారీ సంస్థకు డీఆర్డీవో తయారు చేసే సంప్రదాయ క్షిపణి సాంకేతికతను బదిలీ చేస్తారు.
ఈ రంగంలో ఉన్న అర్హతగల ఎంఎస్ఎంఈస్ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా) పరిశ్రమలు అన్నింటికీ ఈ టెక్నాలజీని అందిస్తారు. ఇందుకోసం ముందుగా తగిన అర్హతలు, తయారీ సామర్ధ్యం, అనుమతులు వంటివి పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న సంస్థల్ని ఎంపిక చేస్తారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలివి. కేంద్రం ప్రోత్సహిస్తున్న ఆత్మనిర్భర భారత్ లక్ష్యం నెరవేరుతుంది. అంటే, క్షిపణులు, ఇతర ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగానే వీటిని అధిక స్థాయిలో తయారు చేయవచ్చు. దీంతో భారత తయారీ సామర్ధ్యం పెరుగుతుంది.
గతంలో ఈ తరహా క్షిపణులు ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేసేవి. దీంతో వీటి ఉత్పత్తి తక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రైవేటు సంస్థలు ఈ రంగంలోకి రావడం.. ప్రభుత్వం టెక్నాలజీ బదిలీ చేయడం కారణంగా మిస్సైల్స్ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. వాటి నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దీంతో మనకు తగినన్ని ఆయుధ నిల్వలుంటాయి. పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మన ఆయుధ నిల్వలు పెంచుకోవడం ప్రస్తుతం చాలా అవసరం. మన ఆయుధ సామర్ధ్యం పెంపునకు, రక్షణ రంగ బలోపేతానికి ఉపయోగపడుతుంది.
ఇది దేశీయ రక్షణకు, నిఘాకు చాలా కీలకమైన ముందడుగు. చైనా, పాక్ వంటి పొరుగు దేశాలు ఆయుధ నిల్వలు పెంచుకుంటున్న తరుణంలో.. యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న ఈ పరిస్థితుల్లో ఆయుధాల తయారీని పెంచడం ఎంతో అవసరం. అందుకే ఇప్పుడు దేశంలోని ప్రైవేటు సంస్తలతో కలిసి డీఆర్డీవో పని చేయబోతుంది.