సికార్, ఫిబ్రవరి 21: గత 20-25 ఏండ్లుగా తమ నగర పరిశుభ్రత కోసం పాటుపడుతున్న ఒక పారిశుధ్య కార్మికుని ఇద్దరు కూతుళ్ల కోసం ఏకంగా నగర ప్రజలంతా ముందుకు వచ్చి అట్టహాసంగా పెండ్లి జరిపించిన ఘటన రాజస్థాన్లో జరిగింది. అందరి మనస్సులను కదిలించిన, మానవత్వానికి తార్కాణంలా నిలిచిన ఈ వివాహాల గురించి తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, విశ్వహిందూ పరిషత్ నేతలు కూడా నగరవాసులకు అభినందనలు తెలియజేశారు.
స్థానికుల కథనం ప్రకారం.. రాజస్థాన్లోని సికార్ నగరంలో పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్న రాధేశ్యామ్కు ఇద్దరు కుమార్తెలు నిఖిత (20), నిషా (22) ఉన్నారు. తన కూతుళ్ల వివాహాలను ఘనంగా చేసే స్థోమత తనకు లేదని అతడు సేథ్ అనంత్రామ్ సింఘానియా చారిటబుల్ ట్రస్ట్ దగ్గర వాపోయారు. దీంతో అతడి ఆవేదనను అర్థం చేసుకొన్న ఆ సంస్థ అతడి కూతుళ్ల పెండ్లిండ్ల బాధ్యతను తానే తీసుకొంది.
నిఖిత, నిషాల పెండ్లిండ్లను ఘనంగా చేయడానికి 5 వేల పెండ్లి శుభలేఖలను అచ్చు వేసి ఊరంతా పంచింది. వేలాది మందికి విందు భోజనం పెట్టింది. కళ్యాణం జరిపించే పురోహితులను అయోధ్య నుంచి రప్పించింది. మొత్తం పెండ్లి ఖర్చంతా సింఘానియా చారిటబుల్ ట్రస్ట్ భరించింది. అంతేకాకుండా ఇరువురు కుమార్తెలకు వివాహానంతరం అవసరమైన దుస్తులు, గృహోపకరణాలను కూడా ఆ సంస్థ సమకూర్చింది. వారి భర్తలకు బైక్లను కూడా కొనిపెట్టింది. నగరంలోని వివిధ వర్గాల ప్రజలు వచ్చి అది తమ ఇంట్లోని పెండ్లిలా భావించి తలో చేయి వచ్చి ఏర్పాట్లలో తమకు తోచిన సహాయాన్ని అందజేశారు.
లగ్గం అయ్యే దాకా ఫోన్ ముచ్చట్లు బంద్!.. ఛత్తీస్గఢ్లోని ఓ సామాజికవర్గం నిషేధం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి21: ఒకప్పుడు పెండ్లి అనేది పూర్తిగా పెద్దల చేతుల మీదుగా జరిగేది. కానీ రాను రాను కాలం మారింది. ఎవరి హక్కులు వాళ్లు తెలుసుకున్నారు. నచ్చిన మనిషిని పెండ్లి చేసుకునే అవకాశాన్ని సంపాదించారు. స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత పరిస్థితి మరోలా మారింది. పెండ్లి నిశ్చయం అయ్యింది మొదలు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలా మాట్లాడుకోవటంపై ఛత్తీస్గఢ్లోని ఓ సామాజికవర్గం నిషేధం విధించింది. పెండ్లి కుదరగానే కాబోయే వధూవరులిద్దరూ ఫోన్లలో ముచ్చట్లు మొదలు పెడుతున్నారు.
గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ మితిమీరిన సంభాషణల కారణంగా చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్య అపోహలు తలెత్తి పెండ్లిపీటలు ఎక్కకుండానే విడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ బాలోద్ జిల్లాలోని సేన్ సామాజిక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సామాజిక వర్గానికి చెందిన వధూవరులు నిశ్చితార్థం తర్వాత పెళ్లయ్యేదాకా ఫోన్లలో మాట్లాడుకోవడంపై నిషేధం విధించింది.