చండీగఢ్: పంజాబ్లో కొలువు తీరిన ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రవాణా శాఖ మంత్రి లల్జిత్ సింగ్ భుల్లర్, ఒక కారుపైన ప్రమాదకరంగా కూర్చొని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోర్డ్ ఎండీవర్పై లల్జిత్ సింగ్ భుల్లర్ కూర్చొని ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్లో పంజాబీ పాట వినిపిస్తుండగా ఆయన తన చేతిని ఊపుతున్నారు. సెక్యూరిటీ గార్డులు కూడా ఆ కారు డోర్ కిటికీపై ప్రమాదకరంగా కూర్చొని, వేలాడుతూ కనిపించారు. పంజాబ్ పోలీసులకు చెందిన రెండు మారుతీ జిప్సీలు ఆయన కారును ఎస్కార్ట్ చేయగా, తెల్లటి బీఎండబ్ల్యూ కారు అనుసరిస్తూ అందులో కనిపించింది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. ‘కేవలం మూడు నెలలే అయ్యింది. అనుకున్న విధంగానే వారు (ఆప్ మంత్రులు) వ్యవహరిస్తున్నారు’ అని ఒకరు విమర్శించారు. ‘మీ లైఫ్తోపాటు సెక్యూరిటీ సిబ్బంది లైఫ్ను ఎందుకు రిస్క్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు’ అని మరొకరు ప్రశ్నించారు.
అయితే తనపై వస్తున్న విమర్శలపై మంత్రి లల్జిత్ సింగ్ భుల్లర్ స్పందించారు. ఆ వీడియో మూడు నెలల నాటిదని తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన సందర్భంలోనిదని చెప్పారు. ఈ పాత వీడియోను ప్రతిపక్షాలు ఇప్పుడు వైరల్ చేస్తున్నాయని విమర్శించారు. తాను బాధ్యతగల, చట్టాన్ని గౌరవించే పౌరుడినని అన్నారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.