తిరువనంతపురం : లవ్ జిహాద్ ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తోసేన్ తెరకెక్కించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ కేరళలో పెద్ద దుమారం రేపుతున్నది. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే ఆరోపణలపై ఈ సినిమాను నిర్మించారు. సినిమాను అధికార సీపీఎంతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా రివార్డుల ప్రకటన పర్వం తెరపైకి వచ్చింది. సినిమాలో చెప్పినట్టుగా 32 వేల మంది కేరళ మహిళలను ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారన్న ఆరోపణలను నిరూపించాలని, అలా ఎవరైనా నిరూపిస్తే రూ.కోటి రివార్డు ఇస్తామని ఐయూఎంఎల్ యూత్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే ఫిరోజ్ ప్రకటించారు. ఆధారాలు ఉంటే ముస్లిం యూత్ లీగ్ జిల్లా కార్యాలయాల్లోని కౌంటర్ల వద్ద సమర్పించి, రివార్డు డబ్బు తీసుకోవాలని అన్నారు.