Rahul Gandhi : అమెరికా (USA) సర్కారుకు భారత ప్రభుత్వం (India govt) తలొగ్గిందని ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు చేసేలా ఉందని, దానివల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కేంద్రబడ్జెట్ (Union Budget) పై చర్చ సందర్భంగా రాహుల్గాంధీ లోక్సభ (Lok Sabha) లో మాట్లాడారు. తన ప్రసంగంలో వాణిజ్య ఒప్పందంతోపాటు ఏఐ ప్రభావం వంటి అంశాల గురించి ప్రస్తావించారని చెప్పారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను బడ్జెట్ ఏమాత్రం ప్రతిబింబించలేదని అన్నారు.
రాహుల్గాంధీ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ప్రపంచం మొత్తం ఏఐ యుగంలోకి వెళ్తోందని చెబుతున్నారు. దీనివల్ల భారత ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాలకు ప్రమాదం ఉంది. మన దేశానికి ప్రతిభావంతులైన యువతరం పెద్ద ఆస్తి. ఏఐకి ఇంధనమే డేటా.. డేటా లేకుండా ఏఐ ఏమీ చేయలేదు. అమెరికా సూపర్ పవర్గా కొనసాగాలంటే భారత్ డేటానే కీలకం. గతంలో అధిక జనాభాను సమస్యగా భావించేవారు. కానీ జనాభా మనకు అతిపెద్ద ఆస్తి. మన డేటాను కాపాడుకునేందుకు భారత్ చర్యలు తీసుకోవడం లేదు. అమెరికా కంపెనీల కోసం ట్యాక్స్ హాలిడే ప్రకటించింది’ అని రాహుల్గాంధీ విమర్శించారు.
‘భారత్ ఏయే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలో అమెరికా చెబుతోంది. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే 50 శాతం టారిఫ్లు వేస్తామని బెదిరిస్తోంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ ద్వారాలు తెరిచింది. భారత ఉత్పత్తులపై ఒకప్పుడు కేవలం 3 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు అది 18 శాతానికి చేరింది. అమెరికా దిగుమతులను 46 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచేశారు. భారత్కు ఈ ఒప్పందం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. డాలర్ను రక్షించుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతోంది’ అని వ్యాఖ్యానించారు.
బడ్జెట్పై ప్రసంగం సందర్భంగా రాహుల్గాంధీ ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తీసుకురాగా.. స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ఎప్స్టీన్ ఫైల్స్ అంశాన్ని పక్కనపెట్టారు. ఈ సందర్భంగా అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్సింగ్ పురీ పేర్లను ప్రస్తావించడంపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆర్డర్ లేవనెత్తారు. దాంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. బడ్జెట్ గురించి మాత్రమే మాట్లాడాలని సూచించారు.
రాహుల్గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించినాకొద్ది అధికారపక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో రాహుల్ గాంధీ కేంద్ర సర్కారు అమెరికాకు తలొగ్గిందని, భారత డేటాను, వ్యవసాయాన్ని, ఇంధన రంగాన్ని అమ్మకానికి పెట్టిందని ఆరోపిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.