పాట్నా: చేపల పెంపకం, నీటి వసతి కోసం వినియోగిస్తున్న చెరువును రాత్రికి రాత్రే చోరీ చేశారు. (Pond stolen) దానిని మట్టితో పూడ్చివేశారు. అక్కడ ఒక గుడిసెను నిర్మించారు. ల్యాండ్ మాఫియా చెరువును మాయం చేయడంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీహార్లోని దర్భంగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దర్భంగాలోని ప్రభుత్వ చెరువు రాత్రికి రాత్రే మాయమైంది. ల్యాండ్ మాఫియా గత కొన్ని రోజులుగా రాత్రివేళ గుట్టుగా ఇసుక, మట్టితో దీనిని పూడ్చివేశారు. చివరకు పూర్తిగా కనుమరుగైన చెరువు స్థానంలో ఒక గుడిసెను నిర్మించారు.
కాగా, చెరువు పూర్తిగా మాయం కావడాన్ని స్థానికులు గమనించారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు చోరీ గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెరువును పూడ్చి కబ్జా చేసింది ఎవర్నదని ఆరా తీస్తున్నారు. బీహార్లో ఇప్పటికే ఇనుప వంతెన, తారు రోడ్డులో కొంత భాగం, టెలిఫోన్ టవర్ వంటివి చోరీ అయ్యాయి. ఇలాంటి అసాధారణ చోరీల సరసన తాజాగా చెరువు కూడా చేరింది.