కోల్కతా: రసవత్తర పోరుకు బెంగాల్ సిద్దమైంది. హై వోల్టేజ్ ప్రచారం తర్వాత.. రేపే పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానాలు ఉన్న ప్రాంతంలో గిరిజన ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. పురులియా, బంకురా, జార్గ్రామ్, పుర్బా మెద్నిపూర్, పశ్చిమ్ మెద్నిపూర్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు అడ్డా అయిన ఈ నియోజకవర్గాల్లో ఈసారి ఎవరి ఆధిపత్యం కొనసాగుతోంది చూడాల్సి ఉంది. బీజేపీ, టీఎంసీలు ఈ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు కూడా ఇక్కడ ప్రచారం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఇక్కడ జోరుగా ప్రచారం నిర్వహించారు. అసలైన మార్పును తీసుకువస్తామని, బంగారు బంగాల్ను తయారు చేస్తామని మోదీ ఓ సభలో పేర్కొన్నారు. శారదా స్కామ్, ఇతర కుంభకోణాల్లో అక్రమార్కులను సీఎం మమతా బెనర్జీ వదిలేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్లను అమలు చేయడంలో దీదీ విఫలమైనట్లు పేర్కొన్నారు. పేద, గిరిజన, దళితులను ఆదుకోలేదన్నారు. టీఎంసీ పాలనలో కమీషన్లు రాజ్యమేటినట్లు ఆరోపించారు. జంగల్మహల్, బంకురా స్థానాల్లో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రచారం చేశారు.
మరో వైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు. తొలి దశ ఎన్నికలు జరగనున్న 30 నియోజకవర్గాల్లో పర్యటించారు. అన్ని చోట్లా ఆమె ర్యాలీలు నిర్వహించారు. ఎడమ కాలికి గాయం తగిలినా.. ఆమె మాత్రం నిర్విరామంగా ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. కరోనా టీకాలను ఉచితంగా ఇవ్వకుండా మోదీ సర్కార్ అడ్డుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. బీజేపీలో చేరిన సీపీఐ గూండాలు తనపై నందీగ్రామ్లో దాడి చేసినట్లు ఆమె అన్నారు. ఖేలా హోబే అన్న నినాదంతో ఆమె ప్రజల వద్దకు వెళ్లారు. టీఎంసీ తరపున ఎంపీ అభిషేక్ బెనర్జీ మరో స్టార్ క్యాంపేనర్ రూపంలో ప్రచారం నిర్వహించారు. బెంగాల్ స్వంత కూతురికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. బెంగాల్లో మొత్తం 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.