ముంబై: పెరోల్పై విడుదలైన అండర్ ట్రయల్ ఖైదీ పరారయ్యాడు. (Absconding Undertrial Nabbed) అయితే అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు ఇంటి యజమానుల అవతారం ఎత్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 2017లో అనుచరుడితో జరిగిన ఘర్షణలో 25 ఏళ్ల బాదల్ వర్మ స్నేహితుడితో కలిసి బుడ్డి అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ కేసులో వీరిద్దరూ అరెస్టయ్యారు. అయితే కరోనా నేపథ్యంలో 2020లో జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలను పెరోల్పై విడుదల చేశారు. ఇలా విడుదలైన బాదల్ వర్మ గడువు ముగిసినప్పటికీ తిరిగి లొంగిపోలేదు. మూడేళ్లుగా పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేసేందుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కాగా, పరారీలో ఉన్న వర్మ కోసం పోలీసులు గాలించారు. గతంలో అతడు ఉన్న ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అయితే అతడు ఆ ఇంటిని ఖాళీ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వర్మ సోదరులను పోలీసులు ప్రశ్నించారు. పాల్ఘడ్ ప్రాంతంలో అతడు ఉన్నాడని, పెయింటర్గా పని చేస్తున్నాడని వారి నుంచి తెలుసుకున్నారు. వర్మ పాత ఫొటో, అతడి మొబైల్ నంబర్ కూడా సంపాదించారు.
మరోవైపు పోలీసులు ఇంటి యజమానులుగా నటించారు. గత వారం వర్మకు ఫోన్ చేసి తమ ఇంటికి పెయింటింగ్ పని ఉందని తెలిపారు. అతడ్ని ఎక్కడ కలవాలి అని అడిగారు. అతడు చెప్పిన అడ్రస్కు ఇద్దరు పోలీసులు వెళ్లారు. ఆ ప్రాంతానికి వచ్చిన వర్మను ఫొటో ఆధారంగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని తిరిగి రిమాండ్కు పంపారు.