రాంచీ : జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీకి అప్పట్లో సలహాదారుగా పనిచేసిన సునీల్ తివారీ వివాదంలో కూరుకుపోయారు. తివారీపై పోలీసులు లైంగిక దాడి కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చిలో తివారీ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా ఆర్గోరా పీఎస్లో తివారీపై ఈనెల 16న లైంగిక దాడి కేసు నమోదు చేశారు.
తివారీ తనను బలవంతంగా లోబరుకున్నాడని, తాను అభ్యంతరం వ్యక్తం చేయగా తీవ్రంగా కొట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని మాజీ సీఎం సలహాదారు తనను బెదిరించాడని ఆరోపించారు. బాధిత మహిళ తివారీ నివాసంలో ఏడాది పాటు పనిచేసి కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల తమ స్వస్ధలానికి తిరిగి వచ్చారు.
ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారి ప్రోద్బలంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధిత మహిళ తెలిపారు. కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, లైంగిక దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తివారీ పేర్కొన్నారు.