LPG Pipeline : దేశంలో ఎల్పీజీ (LPG) సరఫరా వ్యవస్థను మరింత పటిష్ఠంచేసే దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.7 వేల కోట్ల వ్యయంతో ఎల్పీజీ పైప్లైన్ నెట్వర్క్ (LPG Pipeline Network) ను భారీగా విస్తరించేందుకు పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఆమోదం తెలిపింది. ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గణనీయమైన లబ్ధి చేకూరనుంది.
ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,800 కిలోమీటర్ల మేర కొత్త పైప్లైన్లను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ వరకు 556 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ను ఏర్పాటు చేయనున్నారు. దీనితోపాటు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్లోని సితార్గంజ్ వరకు (611 కి.మీ.), మహారాష్ట్రలోని శిక్రాపూర్ నుంచి కర్ణాటక, గోవాలోని హుబ్లీ వరకు (633 కి.మీ.) మరో రెండు ప్రధాన మార్గాలను కూడా నిర్మించనున్నారు.
ఈ పైప్లైన్లు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల గుండా వెళతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోని మొత్తం ఎల్పీజీ పైప్లైన్ నెట్వర్క్ ప్రస్తుతం ఉన్న 7,700 కిలోమీటర్ల నుంచి 9,500 కిలోమీటర్లకు విస్తరిస్తుంది. పైప్లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాను పెంచడంవల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, రహదారులపై ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల ముప్పు కూడా గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.