ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనికి భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్టీ సీనియర్ ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా భారత్ ఈ ఓటింగ్లో పాల్గొంటే బాగుండేదని మనీశ్ తివారీ ట్విట్టర్ వేదికగా సూచించారు. దేశాలన్నీ కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఒకటి వస్తుంది. ఆ సమయంలో ఎవరికి వారే అన్నట్టుగా ఉండొద్దు. ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా భారత్ ఐరాస భద్రతా మండలిలో ఓటు వేస్తే బాగుండేది. ఉక్రెయిన్ అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటోంది. మిత్రుడు ఎప్పుడైనా తప్పులు చేస్తే వాటిని ఎత్తిచూపే విధంగా ఉండాలి. ప్రపంచం పైనున్న ముసుగు తొలిగిపోయింది. భారత్ ఏ వైపు అన్నది చూసుకోవాల్సిందే అంటూ మనీశ్ తివారీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఉక్రెయిన్పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీనిపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో భారత మద్దతు కోరుతున్నట్లు అంతకుముందే రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ మాత్రం ఈ ఓటింగ్లో పాల్గొనలేదు. దీనిపై అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా విదేశీ వ్యవహారాల కౌన్సిల్ అధ్యక్షుడు రిచర్డ్ హాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుతిన్కు భారత్ భయపడిందంటూ అవమానించాడు.