చండీగఢ్: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా ( Om Prakash Chautala ) ఎట్టకేలకు 10వ తరగతి పాసయ్యారు. వెనుకటికి 10వ తరగతి ఇంగ్లిష్లో ఫెయిల్ అయిన చౌతాలా ఆ తర్వాత చదువు మానేశారు. అయితే ఇటీవల లేటు వయసులో మళ్లీ చదవాలనిపించి.. ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే ఈ ఏడాది ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్ను పాస్ చేశారు.
అయితే, 10వ తరగతిలో ఒక సబ్జెక్టు పెండింగ్ ఉన్న కారణంగా చౌతాలా ఇంటర్ ఫలితాన్ని విత్ హెల్డ్లో పెట్టారు. దాంతో ఆయన ఇటీవల 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్ష రాశారు. ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణులైనట్లు శనివారం హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లిష్ సబ్జెక్టులో మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగగా చౌతాలాకు 88 మార్కులు వచ్చాయి.