ముంబై: ఆర్బీఐ ( RBI ) కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లను వరుసగా ఏడోసారి కూడా మార్చలేదు. ద్రవ్యపరపతి విధాన సమీక్ష విషయాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గృహ, ఆటో రుణదారులకు ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. రెపో రేటును 4 శాతం వద్దే ఉంచారు. రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే ఉంచినట్లు దాస్ తెలిపారు. సెకండ్ కోవిడ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా తేరుకోవాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం కీలక రేట్ల జోలికి వెళ్లలేదన్న ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని ఆర్బీఐ పేర్కొన్నది. 2021-22లో జీడీపీ వృద్ధి 9.5 శాతం ఉంటుందని, ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.8 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.