న్యూఢిల్లీ: కరోనా వైరస్ కోసం పూర్తిస్థాయిలో లేదా కనీసం సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ సోకిన సందర్భాలు ఉన్నా.. వాళ్లలో ఎవరూ చనిపోలేదని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధ్యయనం తేల్చింది. గత ఏప్రిల్-మే నెలల్లో కరోనా సోకిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇండియాలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకిన వారి శాంపిళ్లపై జీనోమిక్ సీక్వెన్స్ అధ్యయనం నిర్వహించారు. అందులోనే ఈ విషయం వెల్లడైంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ సోకితే దానిని బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్గా పిలుస్తున్నారు.
అధ్యయనంలో ఏం తేలింది?
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ వైరల్ లోడ్ అధికంగా ఉన్నా కూడా దీనివల్ల ఎవరూ చనిపోలేదని ఈ అధ్యయనంలో తేలింది. మొత్తం 63 బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లలో 36 మంది రెండు డోసులూ తీసుకోగా.. 27 మంది ఒక డోసు తీసుకున్న వాళ్లు ఉన్నారు. వీళ్లలో 10 మంది కొవిషీల్డ్, 53 మంది కొవాగ్జిన్ తీసుకున్నారు. అయితే బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లలో ఏదీ ప్రాణాంతకం కాలేదని ఈ అధ్యయనంలో తేలింది. కాకపోతే ఈ కేసులన్నింటిలోనూ ఐదు నుంచి ఏడు రోజుల వరకూ అధిక జ్వరంతో బాధపడ్డారు. ఈ 63 మందిలో 21 నుంచి 92 ఏళ్ల వయసులు వాళ్లు ఉన్నారు.
వీళ్లలో ఎవరికీ దీర్ఘకాలిక వ్యాధులు లేవు. పది మందిలో పూర్తిస్థాయి ఇమ్యూనోగ్లోబులిన్ జీ యాంటీబాడీలు గుర్తించారు. వీళ్లలో ఆరుగురికి ఇన్ఫెక్షన్ సోకడానికి నెల రోజుల ముందే యాంటీబాడీలు వృద్ధి చెందగా.. నలుగురిలో ఇన్ఫెక్షన్ తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందాయి.