న్యూఢిల్లీ, జూన్ 27: జూలై ఒకటో తారీఖు నుంచి బ్యాంకింగ్, కార్మిక రంగాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవి..
క్రెడిట్ కార్డుల్లో మార్పులు
క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ పలు మార్పులు చేసింది. క్రెడిట్ కార్డులను తొలగించుకోవడం, బిల్లుల చెల్లింపుల విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కొత్త రూల్స్ అన్ని షెడ్యూల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు వర్తిస్తుంది. పేమెంట్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తించవు.
కొత్త రూల్స్ ప్రకారం వినియోగదారుడి ప్రమేయం లేకుండా బ్యాంకులు కొత్త క్రెడిట్ కార్డులు ఇచ్చినా.. అప్గ్రేడ్ చేసినా.. ఆ తర్వాత దానికి సంబంధించి బిల్లులు వేసినా ఆ మొత్తాన్ని కార్డు ఇచ్చిన సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బిల్లు మొత్తానికి రెట్టింపు జరిమానా విధిస్తారు.
వినియోగదారుడి వద్ద ఉన్న క్రెడిట్ కార్డును వద్దనుకుంటే.. ఈ విషయంలో కంపెనీకి ఫిర్యాదు చేస్తే 7 రోజుల్లోగా ఆ కార్డును బ్లాక్ చేయాలి. లేదంటే అప్పటి నుంచి ప్రతి రోజూ సంస్థ రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం నిషేధం విధించింది. వీటి తయారీ, పంపిణీ, దిగుమతి, అమ్మకంపైనా నిషేధం విధించింది. బెలూన్ పుల్లలు, సిగరెట్ ప్యాకెట్లు, డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఇయర్ బడ్స్, ఐస్క్రీం పుల్లలు, పీవీసీ బ్యానర్లు మరికొన్ని నిషేధిత జాబితాలో ఉన్నాయి.
జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలు వస్తే..
రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 8 గంటలే ఉండేది. అయితే వారంలో 4 రోజులు మాత్రమే పని ఉంటుంది. మూడు రోజులు కంపెనీలు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది.
భవిష్య నిధిలో ఎక్కువ మొత్తంలో జమ చేయాల్సి రావడం వల్ల చేతికి అందాల్సిన మొత్తం తగ్గుతుంది. గ్రాస్ శాలరీలో 50 శాతం మేర పీఎఫ్లో జమ చేయాల్సి వస్తుంది. . ఆర్జిత సెలవులు(ఈఎల్) పొందే అర్హతను 240 పనిదినాల నుంచి 180 రోజులకు తగ్గించారు. ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి 240 రోజుల పనిచేసిన తర్వాతనే ఈఎల్స్ లభించేవి. దాన్ని 180 రోజులకు కుదించారు.
ఇప్పటివరకు 23 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే ఈ చట్టాలపై ముసాయిదా నిబంధనలను రూపొందించాయి.